Coordinates: 23°58′N 68°48′E / 23.967°N 68.800°E / 23.967; 68.800

సర్ క్రీక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్ క్రీక్
సర్ క్రీక్ is located in India
సర్ క్రీక్
భారత పటంలో సర్ క్రీక్
భౌతిక లక్షణాలు
సముద్రాన్ని చేరే ప్రదేశం 
 • స్థానం
అరేబియా సముద్రం
 • అక్షాంశరేఖాంశాలు
23°58′N 68°48′E / 23.967°N 68.800°E / 23.967; 68.800
పరీవాహక ప్రాంత లక్షణాలు
River systemసింధు నది

సర్ క్రీక్, భారత, పాకిస్తాన్ల సరిహద్దులో సింధు నది డెల్టాలో జనావాసాలు లేని చిత్తడి నేలల్లో 96-కిమీ (60-mi) పొడవున ఉన్న ఉప్పునీటి కయ్య. ఈ క్రీక్ అరేబియా సముద్రంలోకి ప్రవహించే ఈ క్రీక్ గుజరాత్ రాష్ట్రాన్ని పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ నుండి వేరు చేస్తుంది. [1] దీని అసలు పేరు బన గంగ. [2] "సర్ క్రీక్ ముఖద్వారం నుండి సర్ క్రీక్ పైభాగం వరకూ, సర్ క్రీక్ ఎగువ నుండి తూర్పు దిశగా ఉన్న రేఖపై పశ్చిమ కొసన ఉన్న బిందువు వరకు" ఉన్న రేఖపై భారత-పాకిస్తాన్ల మధ్య సర్ క్రీక్ సరిహద్దు వివాదం ఉంది. [1] [3] 1968 ట్రిబ్యునల్ అవార్డులో [4] ఈ బిందువు నుండి తూర్పుగా ఉన్న సరిహద్దును సందేహాతీతంగా నిర్ణయించారు.

వ్యుత్పత్తి[మార్చు]

సర్ క్రీక్‌ని మొదట బన గంగ అని పిలిచేవారు. బ్రిటిష్ రాజ్ కు చెందిన ఒక ప్రతినిధి పేరు మీదుగా దీనికి సర్ క్రీక్ అని పేరు పెట్టారు. [2]

భౌగోళికం[మార్చు]

ఈ చిత్తడి ప్రాంతం రక్త పింజరులకు, విష పూరితమైన తేళ్ళకూ నిలయం. వీటి వలన సరిహద్దులో ఉండే సైనికులకు ఇబ్బందులు ఎదురౌతాయి. [5] జూన్మ్ సెప్టెంబరు మధ్య ఉండే వర్షాకాలంలో క్రీక్, ఒడ్డు ఒరుసుకుంటూ ప్రవహిస్తూ చుట్టూ ఉన్న లోతట్టు ఉప్పు బురద ప్రాంతాన్ని ఆవరిస్తుంది. శీతాకాలంలో, ఈ ప్రాంతం ఫ్లెమింగోలు, ఇతర వలస పక్షులకు నిలయంగా ఉంటుంది. 24o ఉత్తర అక్షాంశం సర్ క్రీక్ గుండా వెళుతుంది. సర్ క్రీక్ లోకి నీరు ప్రధానంగా నరేరి సరస్సు నుండి వస్తుంది. ఈ సరస్సు నుండి వచ్చే నీరు క్రీక్ కుడి వైపున కలుస్తుంది. [6] LBOD అనే కాలువ, సర్ క్రీక్‌లోకి నీటి వ్యర్థాలను కూడా విడుదల చేస్తుంది.

సర్ క్రీక్‌కు పశ్చిమాన, పాకిస్తానీ వైపు అనేక ఇతర క్రీక్‌లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ, కేటీ బండర్ సౌత్ వైల్డ్‌లైఫ్ అభయారణ్యంలో భాగం.

సర్ క్రీక్ భారతదేశంలోని గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతానికి పశ్చిమాన ఉంది. భారతదేశం వైపున ఉన్న ఆరు ప్రధాన క్రీక్‌లలో సర్ క్రీక్ ఒకటి. మిగిలినవి - వియన్ వారీ క్రీక్, పీర్ సనై, పబెవరి, పడాల (సర్ క్రీక్ నుండి ఆగ్నేయంగా 16 km (9.9 mi)), తూర్పు చివరన కోరి (సర్ క్రీక్ నుండి ఆగ్నేయంగా 34 km (21 mi)). [7] [5] సర్ క్రీక్ అనే పశ్చిమ క్రీక్ మినహా ఈ క్రీక్‌లన్నీ భారతదేశంలోని వివాదరహిత భూభాగంలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రవాహ మార్గాన్ని మార్చుకుంటూ ఉండే ఈ క్రీక్‌లు, భారత భూభాగం నుండి పాకిస్తాన్‌లోకి ప్రవేశించి, భారతదేశంలోకి తిరిగి ప్రవేశిస్తూ, అలాగే పాకిస్తాన్‌ నుండి భారత్ లోకి ప్రవేశిస్తూ ప్రవాహ మార్గాన్ని మార్చుకుంటూ ఉంటాయి. కంచె లాంటి భౌతిక అవరోధమేమీ లేకపోయినా ఇవి, కాపలా కాసేందుకు కష్టంగా ఉండే చిత్తడి నేల సరిహద్దును ఏర్పరుస్తున్నాయి. [5]

హరామి నాలా, బోంధో ధోరో అనే రెండు ఛానెల్‌లు, చొరబాట్లను, చట్టవిరుద్ధ కార్యకలాపాలనూ నిరోధించడంలో భారతదేశానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. భారతదేశం వైపున ఉన్న వియన్ వారీ క్రీక్, ఉత్తరాన పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ దీనిని హరామి ధోరో అని పిలుస్తారు. అది తూర్పు వైపున తిరిగి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది, ఇక్కడ దీనిని హరామి నాలా అని పిలుస్తారు. ఆ తరువాత అది రెండు ప్రవాహాలుగా విడిపోతుంది. అందులో ఒకటి తిరిగి పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరోధించడంలో భారతదేశానికి వ్యూహాత్మక సవాలుగా నిలుస్తోంది. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని సుజావాల్ జిల్లాలో హరామి నాలాకు ఉత్తరాన భారతదేశంలోకి ప్రవేశించే బోంధో ధోరో ఛానల్, పడవ ద్వారా చొరబడటానికి వీలయ్యే మరొక స్థానం. ఈ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. బోంధో ధోరోకు ఉత్తరాన చైనా ఆర్థిక సహాయంతో చైనా కట్టను నిర్మించారు . [5]

భారత సరిహద్దు భద్రతా దళం (BSF) సర్ క్రీక్‌లో తేలియాడే సరిహద్దు పోస్ట్‌లు, ఉభయచర వాహనాలు, క్రీక్ క్రోకోడైల్ కమాండోల ద్వారాను, నడక ద్వారానూ క్రీక్‌లో మధ్య వరకు గస్తీ నిర్వహిస్తుంది. సర్ క్రీక్ తీర ప్రాంతంలో భారతీయ తీర రక్షక దళం గస్తీ నిర్వహిస్తుంది. వెలుపల ఉన్న సముద్రంలో భారత నౌకాదళం గస్తీ కాస్తుంది. [5]

భారత-పాకిస్తాన్ సరిహద్దు వివాదం[మార్చు]

ఆకుపచ్చ రేఖ పాకిస్థాన్ చెప్పుకుంటున్న సరిహద్దు. ఎరుపు రేఖ భారత సరిహద్దు. మ్యాపు స్కేలుకు అనుగుణంగా లేదు

చరిత్ర[మార్చు]

భారతదేశం పాకిస్తాన్ల మధ్య సముద్ర సరిహద్దు రేఖ వివరణలో వివాదం ఉంది. స్వాతంత్ర్యానికి ముందు, ఈ ప్రాంతం బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సింధ్ పాకిస్తాన్‌లో భాగమైంది.

1968లో, ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్ భారత, పాకిస్తాన్ ల మధ్య గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ సరిహద్దు వివాదాలను పరిష్కరించింది. ఈ పరిష్కారంలో సర్ క్రీక్‌ కూడా భాగం. ఈ తీర్మానంలో భారతదేశ వాదనలో 90 శాతం వరకూ ఆమోదం పొందగా, పాకిస్తాన్ వాదనలో 10% ఆమోదం పొందింది. సర్ క్రీక్‌లో ఇంకా కొన్ని వివాదాస్పద అంశాలు మిగిలే ఉన్నాయి. 1997 నుండి 2012 వరకు, రెండు దేశాల మధ్య పన్నెండు రౌండ్ల చర్చలు జరిగాయి గానీ, ఎటువంటి పురోగతి లేదు. [8] 2008లో, నాల్గవ రౌండ్‌లో, ఉమ్మడి సర్వే ఆధారంగా ప్రాంతానికి చెందిన ఉమ్మడి మ్యాప్‌పై ఇరుపక్షాలు అంగీకరించాయి. [1] వివాదాన్ని పరిష్కార ప్రతిపాదనల్లో కేటాయింపు, డీలిమిటేషన్, విభజన, పరిపాలన భాగంగా ఉన్నాయి. ఇరు పక్షాలు ఒక పరస్పర ఆమోదనీయ స్థితికి రానందున, సముద్ర చట్టపు సాంకేతిక అంశాల (TALOS) నిబంధనల ప్రకారం సముద్ర సరిహద్దును ముందుగా గుర్తించవచ్చని భారతదేశం ప్రతిపాదించింది. అయితే, సర్ క్రీక్ వివాదాన్ని ముందుగా పరిష్కరించాలని పాకిస్తాన్ పట్టుబట్టి, ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇరుపక్షాలు అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి వెళ్లాలని పాకిస్థాన్ ప్రతిపాదించగా, భారత్ తిరస్కరించింది. ద్వైపాక్షిక సిమ్లా ఒప్పందం ప్రకారం, అన్ని ద్వైపాక్షిక వివాదాలు మూడవ పక్షాల జోక్యం లేకుండా పరిష్కరించుకోవాల్సిందేనని భారతదేశం పేర్కొంది. [9] 1968 లో ట్రిబ్యునల్ చేసిన తీర్మానంలో రెండు దేశాల మధ్య సరిహద్దులను గుర్తించింది. తమ సరిహద్దు క్రీక్ యొక్క తూర్పు పార్శ్వం అని వాదించింది. [10] సింధ్ ప్రభుత్వానికి, కచ్‌కు చెందిన రావ్ మహారాజ్‌కూ మధ్య 1914 లో జరిగిన ఒప్పందం లోని [11] 9, 10 పేరాల ప్రకారం మొత్తం క్రీక్‌ అంతా పాకిస్తాన్‌కు చెందుతుందని అది వాదించింది. [9]

1908లో సింధ్ డివిజనుకు, రావు మహారాజ్‌కూ మధ్య వివాదం తలెత్తినప్పుడు, సింధ్ డివిజనూ, రావు మహారాజ్ భూభాగం అంతా అప్పటి బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి ప్రెసిడెన్సీ అధికార పరిధిలో ఉండేది. అంచేత భారతదేశం పాకిస్తాన్ వాదనలతో విభేదించింది. [1] సింధ్ డివిజన్ 1936 ఏప్రిల్ 1 న సింధ్ ప్రావిన్స్‌గా మారినప్పుడు మాత్రమే బొంబాయి ప్రెసిడెన్సీ నుండి వేరైంది. [12] బాంబే ప్రెసిడెన్సీ ప్రభుత్వం 1911లో ఒక సర్వే నిర్వహించి, 1914లో రెండు విరుద్ధమైన పేరాలతో కూడిన వివాద పరిష్కార తీర్పును ఇచ్చింది. కచ్, సింధ్ మధ్య సరిహద్దు సర్ క్రీక్‌కు తూర్పున ఉందని తీర్పులోని 9వ పేరా పేర్కొంది, అయితే తీర్పులోని 10వ పేరా "సర్ క్రీక్ సంవత్సరంలో ఎక్కువ భాగం నౌకాయానానికి అనువుగా ఉంటుంది కాబట్టి. అంతర్జాతీయ చట్టం, థాల్వేగ్ సూత్రం ప్రకారం, నౌకాయాన మార్గం మధ్యలో మాత్రమే సరిహద్దును నిర్ణయించే వీలుంది. అంటే సర్ క్రీక్ సింధ్, కచ్ లు రెండింటికీ చెందుతుందని అర్థం. తద్వారా ఇది భారతదేశం పాకిస్తాన్ ల మధ్య విభజించబడినట్లు." [2] ఈ తీర్మానం థాల్వెగ్ సూత్రంపై ఆధారపడి ఉందని తీర్మానపు పాఠ్యం సూచిస్తోంది. అంతర్జాతీయ చట్టంలోని థాల్వేగ్ సిద్ధాంతాన్ని ఉదహరిస్తూ భారతదేశం, తన వైఖరిని ఉద్ఘాటించింది. [1] థాల్వేగ్ చట్టపరమైన సూత్రం ప్రకారం, రెండు రాజకీయ సంస్థల మధ్య సరిహద్దు జలమార్గంగా పేర్కొనబడితే, ఆ రెండింటి మధ్య సరిహద్దు ఆ నీటి ప్రవాహపు థాల్‌వేగ్‌ను అనుసరిస్తుంది. ప్రత్యేకించి, సరిహద్దు జలమార్గం యొక్క ప్రధాన నావిగేబుల్ ఛానల్ మధ్యగా వెళ్తుంది. [13] థాల్వేగ్ సూత్రాన్ని వర్తింపజేసినప్పుడు, UNCLOS (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ) భారతదేశ వాదనకు మద్దతు ఇస్తుంది, దీని ఫలితంగా "భూమి/సముద్ర టెర్మినస్ పాయింట్ అనేక కిలోమీటర్లు పాకిస్తాన్‌ భూభాగం లోకి జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ కింద పాకిస్తాన్ స్వంత ఆర్థిక మండలిలో అనేక వేల చదరపు కిలోమీటర్లు కోల్పోతుంది." [2]

1925లో గీసిన మరొక మ్యాప్‌లో వర్ణించబడినట్లుగా, 1924 లో [10] స్తంభాలను ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసినట్లుగా, సరిహద్దు రేఖ ఛానల్‌కు మధ్యగా పోతుందని భారతదేశం తన వైఖరిని మరింతగా స్పష్టం చేసింది. పాకిస్తాన్ 1925 మ్యాప్‌ను వివాదాస్పదం చేయనప్పటికీ, ఈ సిద్ధాంతం సాధారణంగా ఆటు పోట్లు లేని నదులకు వర్తిస్తుంది. కానీ, సర్ క్రీక్ ఒక ఆటు పోట్లు వచ్చే ఉప్పు నీటి కయ్య అని, ఈ విషయంలో వర్తించదనీ పాకిస్తాన్ పేర్కొంది. క్రీక్ అధిక ఆటుపోట్లలో నౌకాయానానికి అనువుగా ఉంటుందని, థాల్వెగ్ సూత్రం టైడల్ వాటర్‌లలో అంతర్జాతీయ సరిహద్దుల కోసం ఉపయోగించబడుతుందనీ, ఫిషింగ్ ట్రాలర్‌లు సముద్రంలోకి వెళ్లడానికి సర్ క్రీక్‌ని ఉపయోగిస్తారనిఈ పేర్కొంటూ భారత్, పాకిస్తాన్ వాదనని తిప్పికొట్టింది.

పాకిస్తాన్‌కు ఆందోళన కలిగించే మరో విషయం ఏమిటంటే, సర్ క్రీక్ కొన్ని సంవత్సరాలుగా తన మార్గాన్ని గణనీయంగా మార్చుకుంది. ప్రస్తుత ఛానెల్‌కు వర్తించే థాల్వెగ్ సూత్రం ప్రకారం సరిహద్దు రేఖను గుర్తించినట్లయితే, పాకిస్తాన్, భారతదేశం రెండూ చారిత్రికంగా తమ ప్రావిన్సులలో భాగంగా ఉన్న చిత్తడి నేలలను చిన్నపాటి భాగాలను కోల్పోతాయి. 

వివాదానికి ఆర్థిక కారణాలు[మార్చు]

క్రీక్‌కు సైనిక విలువ పెద్దగా లేనప్పటికీ, దీనివలన అపారమైన ఆర్థిక ప్రయోజనాలున్నాయి. ఈ ప్రాంతంలో సముద్రపు అడుగున చమురు, వాయువులు సమృద్ధిగా ఉన్నాయి. క్రీక్‌పై నియంత్రణ కలిగిన దేశపు ఇంధన సామర్థ్యంపై ఇది భారీ ప్రభావం చూపుతుంది. అలాగే, సరిహద్దులను నిర్వచించడంలోను, సముద్ర సరిహద్దులను నిర్ణయించడంలోనూ ఇది ప్రయోజనం కలిగిస్తుంది. సముద్ర సరిహద్దులు స్వంత ఆర్థిక మండలాలు (EEZలు), కాంటినెంటల్ షెల్వ్‌ల పరిమితులను నిర్ణయించడంలో కూడా సహాయపడతాయి. EEZలు తీరం నుండి 200 నాటికల్ మైళ్ల (370 కిమీ) దూరం వరకు విస్తరించి ఉంటాయి. ఈ మండలంపై వాణిజ్య పరమైన హక్కు ఉంటుంది. [4]

రెండు దేశాల మత్స్యకారులు ఒకరి భూభాగాల్లోకి అనుకోకుండా దాటడాన్ని కూడా ఈ సరిహద్దు అడ్డుకుంటుంది. భారత, పాకిస్తాన్లు వివరిస్తున్న ఆర్థిక కారణాలకు భిన్నంగా, రెండు దేశాల మత్స్యకారుల మధ్య ఘర్షణలు య్తలెత్తుతాయి. వారి ఆర్థిక హక్కులపై ప్రభావం పడుతుంది. సరిహద్దు దాటినందుకు భారత పాకిస్తాన్ ప్రభుత్వాలు ఇతర దేశాల మత్స్యకారులను అరెస్టు చేస్తాయి. అయితే, సరిహద్దు సముద్రంలో ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ ముగుస్తుందో సంప్రదాయ మత్స్యకారుడికి తెలియకపోవచ్చు. సముద్రంలో పడవను కదిలించే గాలి ప్రవాహం, అలలు, కల్లోలం వంటివి ఈ అయోమయాన్ని మరింత పెంచుతాయి. ఐరాస చట్టం ఈ నేరానికి కనీస స్థాయిలో పెనాల్టీ విధించి, వారి పడవలను విడుదల చేయాలని సూచించింది. అయితే భారత పాకిస్తాన్ ప్రభుత్వాలు ఈ మత్స్యకారులను పట్టుకుని చాలా కాలం పాటు జైళ్లలో ఉంచాయి. వారిని భారత పాకిస్తాన్ భూ సరిహద్దు (వాఘా సరిహద్దు) గుండా మాత్రమే విడుదల చేస్తారు కాబట్టి, కాబట్టి ఈ మత్స్యకారులు తమ పడవలను వదిలేసి, స్వదేశానికి తిరిగి వెళ్ళాల్సి వస్తోంది. [14]

ప్రధాన సింధు నది చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలను సేకరించేందుకు పాకిస్తాన్, 1987, 1997 మధ్య LBOD కాలువను నిర్మించింది. సింధు నదిలో లభించే మంచినీటిని కలుషితం చేయకుండా, ఈ LBOD కాలువ ద్వారా మురుగు నీటిని సర్ క్రీక్‌లోకి విడుదల చేస్తారు. అయితే, LBOD నిర్మాణం సింధు జలాల ఒప్పందాన్ని (ఆర్టికల్ IV) ఉల్లంఘించి, భారతదేశానికి భౌతిక నష్టాన్ని కలిగిస్తోంది (పోటు సమయంలో క్రీక్ ప్రాంతాన్ని ఈ మురుగు నీరు ముంచెత్తుతుంది). ఈ కారణం వల్ల ఈ వివాదాన్ని అంతర్జాతీయ సంప్రదాయాల ప్రకారం పరిష్కరించకుండా, సజీవంగా ఉంచడంలో పాకిస్తాన్‌కు ఆర్థిక పరమైన ఆసక్తి ఉంది. భారతదేశం క్రీక్ ప్రాంతంపై పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ భారత్‌కు ఆధిపత్యం ఉంటే, సింధు జలాల ఒప్పందంలో ఉన్న మధ్యవర్తిత్వ విధానం ప్రకారం భారతదేశం LBOD వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది. [5]

సంఘటనలు[మార్చు]

అట్లాంటిక్ విమాన సంఘటన[మార్చు]

ఈ వివాదాస్పద ప్రాంతం 1990 ఆగస్టు 10 న జరిగిన అట్లాంటిక్ విమాన సంఘటనకు ప్రసిద్ధి చెందింది. భారత వైమానిక దళానికి చెందిన MiG-21FL యుద్ధ విమానాలు, 16 మంది నౌకాదళ అధికారులతో ప్రయాణిస్తున్న పాకిస్తాన్ నేవీకి చెందిన బ్రెగ్యుట్ అట్లాంటిక్‌ అనే నిఘా విమానాన్ని [15] భారత గగనతలాన్ని ఉల్లంఘించినందుకు కూల్చివేసాయి. కార్గిల్ యుద్ధం జరిగిన ఒక నెల తర్వాత ఈ సంఘటన జరిగింది. దీంతో భారత, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. [16]

సంఘటన తర్వాత, పాకిస్తాన్ మెరైన్ యూనిట్లను ఈ ప్రాంతంలో మోహరించారు. నేల పై నుండి గాలి లోకి ప్రయోగించే క్షిపణులను గణనీయమైన సంఖ్యలో మోహరించారు. [15] [17] 1999లో, పాక్ మెరైన్‌లు భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21ఎఫ్‌ఎల్‌పై పొరపాటున ఒక క్షిపణిని ప్రయోగించగా అది తృటిలో తప్పిపోయింది. [15] సర్ క్రీక్ ప్రాంతంలో అదనపు మెరైన్ బెటాలియన్‌లు, స్నైపర్ రీకాన్ యూనిట్‌లను మోహరించారు. [18]

సైనిక సమీకరణ, తీవ్రవాద హెచ్చరిక[మార్చు]

2019 జూన్ నుండి, సర్ క్రీక్ వద్ద పాకిస్తాన్ వేగంగా బలగాలను మోహరిస్తోందని అనేక వార్తాపత్రికలు నివేదించాయి. భారతదేశం కూడా అదే విధంగా వేగంగా స్పందించింది. 1999 అట్లాంటిక్ సంఘటన తరువాత, పాకిస్తాన్ తన 31వ క్రీక్ బెటాలియన్‌ను మోహరించింది. సుజావాల్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ నెటాలియన్‌ ఉత్తరాన హాజీ మోరో జాట్ క్రీక్ నుండి దక్షిణాన కరాచీలోని కోరంగి క్రీక్ కంటోన్మెంట్ వరకు బాధ్యత వహిస్తుంది. 2019లో, మరిన్ని పదాతిదళం, ఉభయచర బెటాలియన్‌లను మోహరించడం ద్వారా దళాల బలాన్ని మూడు బ్రిగేడ్‌లకు పెంచాలనే ఉద్దేశ్యంతో, ఘరోలో ప్రధాన కార్యాలయం కలిగిన 32వ క్రీక్ బెటాలియన్‌ను కూడా పాకిస్తాన్ మోహరించింది. తీరప్రాంత నిఘా కోసం పాకిస్తాన్ 6 తీరప్రాంత రక్షణ పడవలను కొనుగోలు చేసింది. కొత్తగా పొందిన 18 సముద్రపు దాడి నావలలో నాలుగింటిని సర్ క్రీక్‌లో మోహరించారు. హోవర్‌క్రాఫ్ట్, ఆఫ్‌షోర్ పెట్రోల్ బోట్‌లతో సహా మరో 60 నౌకాదళ నౌకలను కొనుగోలు చేయాలని పాకిస్థాన్ యోచిస్తోంది. పీర్ సమాధి క్రీక్‌కు పశ్చిమాన బంధా ధోరో, హరామి ధోరో ప్రాంతంలో పాకిస్తాన్ రెండు కొత్త మెరైన్ పోస్టులను కూడా ఏర్పాటు చేసింది. పాకిస్తాన్‌కు చెందిన 21వ ఎయిర్ డిఫెన్స్ యూనిట్, గ్వాదర్ పోర్ట్‌లో మూడు మెరైన్ యూనిట్లు అలాగే ఒర్మారా వద్ద జిన్నా నేవల్ బేస్ కూడా ఉన్నాయి. మెరుగైన రాడార్ నెట్‌వర్క్, ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు, రాడార్ ఆపరేటెడ్ గన్‌లు, నాలుగు లాక్‌హీడ్ P-3 ఓరియన్ యాంటీ సబ్‌మెరైన్, సముద్ర నిఘా విమానాలు, పాకిస్తాన్ వైమానిక దళం, కరాచీ లోని మస్రూర్‌, PNS మెహ్రాన్ నౌకాదళ వైమానిక స్థావరాలలో రెండు ATR ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఉంచి పాకిస్తాన్, తన వైమానిక రక్షణను కూడా పెంచుకుంది. [19] [20]

2018లో, క్రీక్‌లోని బంధా ధోరో, హరామి ధోరో ఛానెల్‌లలో భారతదేశపు BSF 14 పడవలను పట్టుకుంది. 2008 ముంబై దాడులలో పాకిస్తానీ ఉగ్రవాదులు తమ పడవను పాకిస్తాన్‌లోని ఈ ప్రాంతం నుండే భారతదేశంలోకి ప్రవేశించినందున వారు సాధారణ మత్స్యకారులా లేదా ఉగ్రవాదులా అని నిర్ధారించడానికి ప్రతి ఒక్కరినీ పరీక్షించారు. [6] 2019 సెప్టెంబరు 9 న, సర్ క్రీక్‌లో కొన్ని నిర్జనంగా ఉన్న పడవలను భారత సైన్యం కనుగొన్న తర్వాత భారత్, ఉగ్రవాద దాడికి సంబంధించిన హెచ్చరికను జారీ చేసింది. [21]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "The troubled waters of Sir Creek: Gujarat CM's demand for a freeze on the disputed creek complicates issue, dated 16 December 2012". India Today. Retrieved 29 Dec 2019."The troubled waters of Sir Creek: Gujarat CM's demand for a freeze on the disputed creek complicates issue, dated 16 December 2012". India Today. Retrieved 29 Dec 2019.
  2. 2.0 2.1 2.2 2.3 Everything You Need To Know About The Dispute Over Sir Creek Between India And Pakistan, India Times, 16 August 2016.
  3. "Pakistan security experts declare Sir Creek dispute 'technically resolved'". dna. 7 September 2013.
  4. 4.0 4.1 "Kargilisation of Sir Creek". The Tribune, Chandigarh. Retrieved May 21, 2006."Kargilisation of Sir Creek". The Tribune, Chandigarh. Retrieved May 21, 2006.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 Away from the LoC, how BSF has secured the natural border between Gujarat and Pakistan, Economic Times 13 July 2018.
  6. 6.0 6.1 "A lake dying, and along with it, livelihoods". Retrieved 20 February 2020."A lake dying, and along with it, livelihoods". Retrieved 20 February 2020.
  7. 21 months on, BSF still bereft of hi-tech tools to fight nature Archived 2019-12-28 at the Wayback Machine, The Tribune, 2015.
  8. "Talks on Sir Creek begin between India-Pak". Archived from the original on June 20, 2012.
  9. 9.0 9.1 "Dialogue on Sir Creek begins". The muslim. Archived from the original on 2008-03-15. Retrieved May 21, 2006.. The muslim. Archived from the original on March 15, 2008. Retrieved May 21, 2006.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  10. 10.0 10.1 "Sir Creek". Islamabad Policy Research Institute. Archived from the original on 2013-12-24. Retrieved May 21, 2006."Sir Creek" Archived 2013-12-24 at the Wayback Machine. Islamabad Policy Research Institute. Retrieved May 21, 2006.
  11. "pak-Pakistan talks: Sir Creek". Embassy of India. Retrieved May 21, 2006.
  12. Great Britain India Office, Imperial Gazetteer of India, London, Trübner & co., 1885
  13. A. Oye Cukwurah, The Settlement of Boundary Disputes in International Law, Manchester University Press, 1967, pp. 51 ff.
  14. "The Plight of Indo-Pak Fishermen and the Need to Appreciate Economic Rights". Oxford Human Rights Hub. 5 September 2014. Retrieved 15 December 2016.
  15. 15.0 15.1 15.2 Bearak, Barry (12 August 1999). "As the Words Keep Flying, Pakistan Fires Errant Missile". New York Times, 1999. New York Times. Retrieved 31 December 2014.Bearak, Barry (12 August 1999). "As the Words Keep Flying, Pakistan Fires Errant Missile". New York Times, 1999. New York Times. Retrieved 31 December 2014.
  16. "The disputed Sir Creek". BBC News. August 10, 1999. Retrieved May 21, 2006.
  17. Marines. "Pakistan Marines deployments". Marines. Archived from the original on 20 డిసెంబర్ 2014. Retrieved 31 December 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  18. Feroze, Sami (12 July 2011). "surface-to-air missiles tested by Pakistan Navy". Dawn News, 2011. Dawn News. Retrieved 31 December 2014.
  19. EXCLUSIVE: Pakistan deploys additional battalion of Marines, establishes two new posts in Sir Creek, Times Now, 5 June 2019.
  20. India-Pakistan Dispute Over Sir Creek Intensifies As Pakistan Deploys Additional Battalions Of Marines, Eurasian times, 2 October 2019.
  21. Terrorists may target south India, says Army, The Hindu, 9 September 2019.